జపాన్ ప్రధానిపై బాంబు దాడి..
జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా పెను ప్రమాదం నుండి బయటపడ్డారు. వకయామా సిటీలో ప్రధాని కిషిదా ఓ మీటింగ్లో పాల్గొన్నారు. అయితే ఆయన ప్రసంగం ప్రారంభించడానికి కొన్ని సెకన్ల ముందే భారీ పేలుడు ఘటన జరిగింది. ఊహించన ఘటనతో మీటింగ్ కు వచ్చిన జనం పరుగులు తీశారు. ప్రధానమంత్రి సెక్యూరిటీ అప్రమత్తం అయ్యింది. ఆయన్ను కింద పడుకోబెట్టి.. ఆయన చుట్టూ భద్రతా సిబ్బంది అడ్డుగా నిలబడ్డారు.
ప్రధాని కిషిదాను వెంటనే అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. బాంబు విసిరిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. వేసింది పొగ బాంబ్ అని కొన్ని మీడియాలు చెబుతున్నాయి. బాంబు వేయటానికి కారణాలు ఏంటీ.. ఎందుకు ఇలా చేశాడు అనే వివరాలు తెలుసుకునేందుకు విచారణ చేస్తున్నారు అధికారులు. గత ఏడాది జూలై 22వ తేదీన మాజీ ప్రధాని షింజో అబేను తుపాకీతో ఓ వ్యక్తి కాల్చి చంపిన విషయం తెలిసిందే.
జపాన్ దేశంలో కీలక రాజకీయ నేతలపై దాడులు జరగటం ఆరు నెలల్లో ఇది రెండోసారి. మాజీ ప్రధాని షింజో అబేను కూడా ఇదే తరహాలో పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతుండగా తుపాకీతో కాల్చి చంపాడు ఓ వ్యక్తి. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అబే తీసుకున్న నిర్ణయాల వల్ల నష్టపోయాం అంటూ ఆ వ్యక్తి చెప్పటం విశేషం.
జపాన్ దేశంలో ప్రధానమంత్రుల టార్గెట్ గా దాడులు పెరగటంపై చర్చ నడుస్తుంది. భ్రదతా వైఫల్యమా లేక మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో జపాన్ మీడియా పెద్ద ఎత్తున ప్రశ్నలు వేస్తుంది.