ప్రస్తుత పరిస్థితుల్లో టిడిపికి జనసేన యువరక్తం అవసరం: పవన్
టిడిపితోనే కలిసి వెళ్తామని ప్రకటించిన జనసేన..ఎన్డీయేతో కటీఫ్
అమరావతిః జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపితో కలిసి నడవాలని నిర్ణయించుకున్న ఆయన ఎన్డీయేకు గుడ్బై చెప్పేశారు. బిజెపి సారథ్యంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్డీయే) నుంచి బయటకు వచ్చినట్టు జనసేన ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే టిడిపి లాంటి బలీయమైన శక్తి అవసరమని పవన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం సవాళ్లు ఎదుర్కొంటోందని, ఈ పరిస్థితుల్లో ఆ పార్టీకి జనసేన మద్దతు అవసరమని స్పష్టం చేశారు. జనసేన, టిడిపి కలిస్తే ఆ ప్రభావం అధికార వైఎస్ఆర్సిపిపై తీవ్రంగా పడుతుందని వివరించారు. జనసేనలాంటి యువరక్తం టిడిపికి అవసరమని నొక్కి చెప్పారు.
కాగా, తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన ఇటీవల ప్రకటించింది. తెలంగాణలో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్న ఆ పార్టీ 32 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించబోతోంది. వీటిలో చాలావరకు స్థానాలు హైదరాబాద్, ఖమ్మం, నల్గొండలోనే ఉన్నాయి. అంతేకాదు తెలంగాణలో పోటీ చేయబోతున్నట్టు ఇటీవల టిడిపి కూడా ప్రకటించింది. ఖమ్మంలో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించనుంది.