వేడెక్కుతున్న నగరి రాజకీయం

రోజాకు పోటీగా వాణీ విశ్వనాథ్.. జనసేన నుంచి పోటీ చేయాలంటూ జనసైనికుల హంగామా!

అమరావతి: ఏపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నియోజకవర్గం పూర్తిగా సినీ గ్లామర్ తో నిండిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నగరి వైస్సార్సీపీ ఎమ్మెల్యేగా సినీ నటి రోజా ఉన్నారు. ఇప్పుడు అదే నియోజకవర్గంపై మరో సీనియర్ అందాల తార వాణీ విశ్వనాథ్ దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లో తాను నగరి నుంచి పోటీ చేయబోతున్నానని ఆమె తెలిపారు. ఇటీవలే నగరిలో పర్యటించిన ఆమెకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆమెకు టీడీపీ నుంచి టికెట్ వచ్చే అవకాశం లేదు. దీంతో బీజేపీ లేదా జనసేనలు ఆమెకు టికెట్ ఆఫర్ చేసే అవకాశాలు ఉన్నాయి.

మరోవైపు నగరి నియోజకవర్గం పుత్తూరులో జనసైనికులు ఈరోజు హంగామా చేశారు. వాణీ విశ్వనాథ్ బ్యానర్లు పట్టుకుని నినాదాలు చేశారు. జనసేనలో చేరి ప్రజలకు సేవ చేయాలని బ్యానర్లపై రాశారు. వాణీ విశ్వనాథ్ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తే గెలిపించుకుంటామని వారు చెప్పారు. మరోవైపు ఇటీవలి పర్యటన సందర్భంగా వాణీ విశ్వనాథ్ మాట్లాడుతూ.. నగరితో తనకు అనుబంధం ఉందని తెలిపారు. తన అమ్మమ్మ నగరిలో నర్సుగా పని చేశారని చెప్పారు. ఆ అనుబంధంతో తాను నగరి ప్రజలకు మరింత దగ్గరవుతానని తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/