6న ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న జగన్.. ప్రధాని మోడీతో భేటీ

అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్న సీఎం

Jagan is going to visit Delhi on 6th

అమరావతిః సిఎం జగన్‌ ఈ నెల 6న ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. తన పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది. చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత జగన్ తొలిసారి ఢిల్లీకి వెళ్తుండటంతో ఆయన పర్యటనపై ఆసక్తి నెలకొంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, పట్టణాభివృద్ది శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురీని కూడా ఆయన కలిసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.

వాస్తవానికి లండన్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఢిల్లీకి జగన్ వెళ్లాలనుకున్నారు. అయితే, ఢిల్లీలో అపాయింట్ మెంట్లు ఖరారు కాకపోవడంతో అప్పుడు ఆయన వెళ్లలేకపోయారు. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ అంశం కూడా జగన్ పర్యటనపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.