రైతుకు తోడుగా నిలిచిన రైతు భరోసా వ్యవస్థ కావాలా? ..దళారీ వ్యవస్థ కావాలా? – సీఎం జగన్
రైతుకు తోడుగా నిలిచిన రైతు భరోసా వ్యవస్థ కావాలా? ..దళారీ వ్యవస్థ కావాలా? అని సీఎం జగన్ అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఈ రోజు వైఎస్సార్ రైతు దినోత్సవంలో పాల్గొన్నారు. 2022–ఖరీఫ్లో పంటలు నష్టపోయిన రైతులకు బీమా పరిహారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుల ఖాతాల్లో పంట బీమా పరిహారం జమ చేస్తున్నామని.. బీమా పరిహారం రూ.1,117 కోట్లు పంపిణీకి శ్రీకారం చుట్టామని, దీంతో రాష్ట్రవ్యాప్తంగా 10.2 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుందని జగన్ అన్నారు. టీడీపీ పాలనలో ఐదేళ్లలో చంద్రబాబు బీమా పరిహారంగా రైతులకు చెల్లించింది కేవలం రూ.3,411 కోట్లు. మేము అధికారంలోకి వచ్చాక రైతులకు చెల్లించింది రూ. 7,802 కోట్లు అని అన్నారు.
ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలగకుండా ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాం. ప్రతి ఏటా మూడు విడతల్లో వైయస్ఆర్ రైతు భరోసా అందిస్తున్నామన్నారు. నాలుగేళ్లలో కోటిన్నర రైతులకు రూ.30 వేల 985 కోట్లు రైతు భరోసా ఇచ్చాం. గ్రామస్థాయిలోనే ఆర్బీకేలు తీసుకొచ్చి రైతులకు సేవలు అందిస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు గజ దొంగల ముఠా మొసలి కన్నీరు కారుస్తోంది. కరువు వచ్చినా చంద్రబాబు ప్రభుత్వంలో పరిహారం ఇవ్వలేదని పేర్కొన్నారు.
‘‘మనకు పాడి పంటలు ఉండే పాలన కావాలా.. నక్కలు, తోడేళ్లు ఉండే పాలన కావాలా? రైతు రాజ్యం కావాలా.. రైతులను మోసం చేసే పాలన కావాలా? రైతుకు తోడుగా ఆర్భీకే వ్యవస్థ కావాలా.. దళారీ వ్యవస్థ కావాలా? పేదల ప్రభుత్వం కావాలా.. పెత్తందారుల ప్రభుత్వం కావాలా? ఏ ప్రభుత్వం కావాలో ప్రజలు ఆలోచించుకోవాలి” అని జగన్ అన్నారు.