మరికాసేపట్లో రైలు ప్రమాద ఘటన వద్దకు సీఎం జగన్

ఆదివారం రాత్రి లో విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాద ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం లో మృతుల సంఖ్య పెరుగుతుంది. మొదట 5 గా భావించిన నేటికీ 14 కు చేరింది. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు జరుగుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు, మంత్రులు, సీఎం అందరూ స్పందించారు. తక్షణమే సహాక చర్యలు ప్రారంభించారు. సీఎం జగన్ మృతులకు ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. మరికాసేపట్లో జగన్ ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించడంతో పాటూ…గాయపడిన వారిని, మృతుల కుటుంబాలను కూడా పరామర్శించనున్నారు.

అలాగే రైలు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ప్రధాని మోడీ మాట్లాడారు.మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు ప్రధాని మోడీ. గాయపడిన వారికి రూ. 50 వేల సాయం ప్రకటించారు.

శుక్రవారం ఏపీలోని విజయనగరం జిల్లాలో ట్రైన్ నెం 08532 విశాఖపట్నం-పలాస రైలు కంటకాపల్లి స్టేషన్ నుంచి బయలుదేరిన 10 నిమిషాలకు చినరావుపల్లి వద్ద ఆగిపోయింది. మూడు లైన్లు ఉండగా మధ్య లైనులో రైలు నిలిచింది. ఆ వెనుక కంటకాపల్లి నుంచి వస్తున్న08504 విశాఖపట్నం-రాయగఢ్ పాసెంజర్ వేగంగా ఢీకొట్టింది. దాంతో విశాఖ – పలాస వెనుక భాగంలోని రెండు భోగీలు, విశాఖ-రాయగడ్ మూడు భోగీలు ఒకదానిపై ఒకటి పడి నుజ్జునుజ్జయ్యాయి.

కొన్ని భోగీలు పక్క ట్రాక్‌పై ఆగి ఉన్న గూడ్స్ రైలుపై పడ్డాయి. ఫలితంగా ప్రమాద తీవ్రత పెరిగిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 14 మంది మరణించగా, 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. వీరిలో 35 మంది పరిస్థితి కాస్త విషమంగా ఉందని సమాచారం. రెండు రైళ్లలో కలిపి దాదాపు 1400 మంది ప్రయాణీకులున్నట్టు సమాచారం. ఈ ఘటన పట్ల సీఎం జగన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించడమే కాకుండా బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 2 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది సర్కార్.