నార్సింగిలో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

suside
suside

గత వారం రోజులుగా వరుసపెట్టి విద్యార్థులు ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారు. ప్రీతీ , రక్షిత, దాసరి హర్ష తాజాగా సాత్విక్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకరు సీనియర్స్ వేదింపులు తట్టుకోలేక మరణిస్తే..మరొకరు ప్రేమ వేదింపులు తట్టుకోలేక మరణించారు. ఇక ఇప్పుడు సాత్విక్‌ ..కాలేజీ యాజమాన్యం ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఘటన నార్సింగి శ్రీ చైతన్య కళాశాలలో చోటుచేసుకుంది.

శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్‌ చదువుతున్న విద్యార్థి ఎన్‌. సాత్విక్‌ తరగతి గదిలోనే మంగళవారం రాత్రి 10.30 సమయంలో ఉరి వేసుకున్నాడు. ఇది గమనించిన తోటి విద్యార్థులు వాహనంలో లిఫ్ట్‌ అడిగి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే, కాలేజీలో ఒత్తిడి వల్లే సాత్విక్‌ ఆత్మహత్య చేసుకున్నాడని తోటి విద్యార్థులు ఆరోపించారు. ఉరి వేసుకున్నా కళాశాల యాజమాన్యం కనీసం ఆసుపత్రికి కూడా తరలించలేదని మండిపడ్డారు. పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియాకు మృతదేహం తరలించారు. సాత్విక్‌ ఆత్మహత్యను నిరసిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు కాలేజీ వద్ద ఆందోళన చేపట్టారు. యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు విద్యార్థి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.