బెంగళూరులో విషాదం.. భారీ వర్షం కారణంగా కృష్ణాజిల్లా టెకీ మృతి

బెంగళూరులో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షం కారణంగా కృష్ణాజిల్లా టెకీ మృతి చెందారు. ఏపీలోని కృష్ణా జిల్లా తేలప్రోలుకు చెందిన భానురేఖ ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తుంది. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వచ్చారు. విధాన సౌధకు సమీపంలోని కేఆర్‌ సర్కిల్ దగ్గరకు చేరుకునే సమయానికి వర్షం ఎక్కువైంది. ఇంతలో అండర్‌పాస్‌లోకి వర్షపు నీరు భారీగా చేరి ఉండడం ఆమె గమనించలేకపోయింది. అండర్‌ పాస్‌లో కొంతదూరం వెళ్లేసరికి కారు పూర్తిగా మునిగిపోయింది.

ఈ క్రమంలో కారులో ఉన్న ఆరుగురు నీటిలో చిక్కుకుపోయారు. వీరు భయంతో కాపాడాలంటూ పెద్దగా కేకలు వేశారు. గమనించిన స్థానికులు నలుగురిని బయటకి తీశారు.. మరో ఇద్దరిని బయటకు తేవడం కష్టంగా మారడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, కార్పొరేషన్ సిబ్బంది గజ ఈతగాళ్లను రంగంలోకి దించి కారులో చిక్కుకున్న వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గ మధ్యలో భానురేఖ ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన కుటుంబసభ్యులను సెయింట్ మార్థాస్‌ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదం నింపింది.