ఢిల్లీ లో నవంబర్ 10 వరకు స్కూల్స్ కు సెలవులు ప్రకటించిన ఢిల్లీ విద్యాశాఖ

దేశ రాజ‌ధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. ఈ తరుణంలో నవంబర్ 10 వరకు స్కూల్స్ కు సెలవులు ప్రకటించాలని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి ఆదేశాలు జారీ చేసారు. ఈ సమయంలో పాఠశాలలు 6 నుండి 12 తరగతులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించుకోవచ్చని సూచించారు.

ఢిల్లీ ప్రభుత్వంలోని విద్యాశాఖ మంత్రి అతిషి మాట్లాడుతూ ఢిల్లీలో అధిక స్థాయికి వాయు కాలుష్యం చేరుకుందన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ కాలుష్యం ముఖ్యంగా ఇది పిల్లలకు చాలా హానికరం కావొచ్చు. వాయు కాలుష్యం దృష్ట్యా, ఢిల్లీ ప్రభుత్వం 2023 నవంబర్ 10 నాటికి ఢిల్లీలోని అన్ని ప్రాథమిక పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించింది.

మరోపక్క శనివారం ఉదయం నాటికి చూసుకుంటే వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 504కి చేరిపోయింది. జహంగీర్‌పురిలో ఈ సూచీ 702, సోనియా విహార్‌లో 618కి పడిపోవడాన్ని చూస్తే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతోంది.

మరోవైపు ఢిల్లీలో విష వాయువుల గాఢత (పీఎం) 2.5 స్థాయిలోనే ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) జారీ చేసినటువంటి ప్రమాణాల కంటే దాదాపు 80 రెట్లు అధికంగా ఉంది. అయితే ఈ గాలిని పీల్చుకోవడం వల్ల ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురికావడం, అలాగే కంటి దురద, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.