భారతదేశ వాతావరణ అంచనా వ్యవస్థలు మెరుగ్గా ఉన్నాయిః కిరణ్ రిజిజు

గత కొన్నేళ్లుగా ఫలితాలు కచ్చితంగా ఉన్నాయన్న కేంద్రమంత్రి

India’s weather forecasting systems best in world, says Kiren Rijiju

న్యూఢిల్లీః ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని వ్యవస్థల కంటే భారతదేశ వాతావరణ అంచనా వ్యవస్థలు మెరుగ్గా ఉన్నాయని, గత కొన్నేళ్లుగా వాటి ఫలితాలు కచ్చితంగా ఉన్నాయని కేంద్ర భూవిజ్ఞాన శాఖ మంత్రి కిరణ్ రిజిజు బుధవారం అన్నారు. రిజిజు ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… వాతావరణ మార్పుల దృష్ట్యా భారత వాతావరణ శాఖ పాత్ర కీలకంగా మారిందన్నారు.

గత కొన్ని సంవత్సరాలలో మన వాతావరణ అంచనా వ్యవస్థలు, ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని వ్యవస్థల కంటే మెరుగ్గా ఉన్నాయని కేంద్రమంత్రి అన్నారు. భారత వాతావరణ శాఖ హెచ్చరికలను పాటించడం ద్వారా తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుందన్నారు.

వాతావరణంలో మార్పులను కచ్చితంగా అంచనా వేయడంలో కీలక పాత్ర పోషించే డాప్లర్ రాడర్ల సంఖ్యను దాదాపు రెట్టింపు చేస్తామని కేంద్రమంత్రి చెప్పారు. ప్రస్తుతం 35గా ఉన్న సంఖ్యను వచ్చే మూడేళ్లలో 68కి పెంచనున్నట్లు తెలిపారు. 2014 నుండి ఐఎండీ అద్భుతంగా పని చేస్తోందన్న ఆయన బిపర్ జోయ్ వంటి తుపానులను కచ్చితంగా ట్రాక్ చేసిందంటూ ప్రశంసించారు.