విద్యార్థులకు హైదరాబాద్‌ మెట్రో గుడ్‌న్యూస్‌

హైదరాబాద్ మెట్రో విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపింది. వేసవి సెలవుల అనంతరం విద్యాసంస్థలు పునః ప్రారంభంకావడంతో విద్యార్థుల కోసం కొత్తగా స్టూడెంట్‌ పాస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది మెట్రో. ఈ పాస్‌ సహాయంతో విద్యార్థులు కేవలం 20 ట్రిప్పుల ఛార్జితోనే 30 ట్రిప్పులు ప్రయాణించవచ్చని తెలిపింది.

ఈ స్టూడెంట్‌ పాస్‌ స్మార్ట్‌ కార్డు రూపంలోనే అందుబాటులో ఉండనుంది. ఈ పాస్‌ సహాయంతో నెల రోజుల్లో 30 ట్రిప్పులు వేయొచ్చు. ఈ పాస్‌ను 9 నెలల వ్యాలిడిటీతో ఇవ్వనున్నారు. అంటే ఈ ఏడాది జూలై 1 నుంచి 2024 మార్చి 31వ తేదీ వరకు ఈ పాస్‌ అందుబాటులో ఉండనుంది. ఈ మేరకు వివరాలను హైదరాబాద్‌ మెట్రో రైలు లిమిటెడ్‌ ట్విట్టర్‌లో వెల్లడించింది.