పవన్ కళ్యాణ్ ను హనీ రోజ్‌ తో పోల్చిన కేతిరెడ్డి

ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై సెటైర్లు వేశారు. తిరుపతి సెంటర్ కు వీర సింహ రెడ్డి ఫేమ్ హనీ రోజ్‌ నిల్చుపెడితే..పవన్ కళ్యాణ్ సభ కంటే ఎక్కువ జనాలు వస్తారని అన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర పేరుతో ఉభయ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాత్ర కు ప్రజలు బ్రహ్మ రధం పడుతున్నారు. జనసేన శ్రేణులు , అభిమానులే కాదు ..ఇతర హీరోల అభిమానులు , ఇతర పార్టీల కార్యకర్తలు సైతం భారీ సంఖ్యలో హాజరు అవుతున్నారు. ఇక పవన్ సైతం అధికార పార్టీ ఫై మాటల తూటాలు పేలుస్తూ..ఆకట్టుకున్నాడు. కాగా పవన్ పర్యటన ఫై వైస్సార్సీపీ నేతలు విమర్శలు సెటైర్లు వేస్తూ ఉన్నారు.

తాజాగా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి మాట్లాడుతూ.. తిరుపతిలో ఒక పక్క హనీ రోజ్ కార్యక్రమం.. మరోపక్క పవన్ కళ్యాణ్ మీటింగ్ జరిగితే జనసేనాని మీటింగ్ కన్నా హనీ రోజ్ కార్యక్రమానికే ఎక్కువ జనం వెళ్తారని అన్నారు. సినీ గ్లామర్ జనాలను అంతగా ఆకర్షిస్తుందని.. సినిమాలు, రాజకీయాలు ఎప్పటికీ ఒక్కటి కావని ఆయన వెల్లడించారు. ‘పవన్ కళ్యాణ్ ఒక ఫ్రెష్ ఫేస్. ఇప్పుడే కాకపోయినా ఎప్పటికైనా ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి కావాలని ఫ్యాన్స్ కానీ, సానుభూతిపరులు కానీ కోరుకోవచ్చు. అతను నాయకుడు కావాలి, పీఠమెక్కాలి అని అతనికి సంబంధించిన వాళ్లంతా కోరుకుకుంటుంటే.. అతను మాత్రం వేరేవాళ్ల పల్లకీలు మోయాలని ఆలోచిస్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అవుతాడంటే జనాలు ఓట్లు వేస్తారు కానీ.. ఇంకొకరి పల్లకీలు మోస్తానంటే, చాల్లే నాయనా నీదేందైనా ఉంటే చెప్పు అంటారు. ఆయన కోరిక తాను గెలవాలని ఉండాలి కానీ వేరేవాళ్లను ఓడించాలని కాదు. పరుగు పందెంలో నేను ఫస్ట్ రావాలని పరిగెత్తాలి కానీ.. పక్కనోడికి కాలు అడ్డంపెట్టి పడగొట్టి నేను గెలవాలనుకోవడం తప్పు. రాజకీయాల్లో ప్రాథమిక అంశాల మీద అవగాహన లేకుండా వచ్చినవాళ్లంతా మా జనాలే అనుకుంటే తప్పు’ అని జనసేనానిపై కేతిరెడ్డి విమర్శలు చేసారు. సినిమా గ్లామర్ చూసి జనాలు రావడం అనేది కొత్తేమీ కాదని.. ఎప్పటి నుంచో సినిమా వాళ్లు మీటింగ్‌లు పెడితే జనాలు వస్తున్నారని కేతిరెడ్డి అన్నారు.