లోయర్ ట్యాంక్ బండ్ వద్ద భారీ పేలుడు..

హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ వద్ద భారీ పేలుడు సంభవించింది. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధి లోయర్ ట్యాంక్ బండ్ స్నో వరల్డ్ సమీపంలో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ లో ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో చెత్త కాగితాలు ఏరుకునే ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గాయపడ్డ వారిని హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. పేలుడుతో భారీ శబ్దం రావడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

సంఘటన స్థలానికి చేరుకున్న చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, గాంధీనగర్ సీఐ మోహన్ రావు సిబ్బంది పేలుడుకు గల కారణాలను తెలుసుకునేందుకు ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన తండ్రి కొడుకులు కర్నూలు జిల్లా నాంచార్ల గ్రామానికి చెందిన చంద్రయ్య, సురేష్ గా గుర్తించారు. వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సురేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.