సీఎం జగన్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హిందూసంఘాలు, పీఠాధిపతులు
ఏపీ సీఎం జగన్ ఫై హిందూసంఘాలు, పీఠాధిపతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒంటిమిట్ట శ్రీ సీతారాముల వివాహ మహోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వం తరుపున సీఎం జగన్ హాజరుకావలసి ఉన్నా, కాలు బెణికిందని చెప్పి కార్యక్రమానికి వెళ్లకుండా ఉన్నారు. ఆ తర్వాత రోజున చిలకలూరిపేటలో జరిగిన పార్టీ కార్యక్రమానికి ఎలా హాజరయ్యారని వారు ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న హిందూ కార్యక్రమాలకు ప్రభుత్వాధినేతగా సీఎం హాజరుకావలసి కార్యక్రమాలకు ఏదో ఒక సాకు చెప్పి తప్పుకుంటున్నారని అన్నారు. కొన్ని రకాల హిందూ ధార్మిక కార్యక్రమాలకు ప్రభుత్వాధినేతలు సతీసమేతంగా హాజరుకావలసి ఉంటుందని, కానీ, సీఎం జగన్ తన భార్యతో కలిసి ఎప్పుడైనా హిందూ ధార్మిక కార్యక్రమాలకు హాజరయ్యారా అని ప్రశ్నిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా కృష్ణాపురం ఆనందాశ్రమ పీఠాధిపతి స్వామి శ్రీనివాసనంద సరత్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. క్రైస్తవమత భావాలు కలిగిన సీఎం జగన్కు, ఆయన కుటుంబానికి హిందూమత సంప్రదాయాలను గౌరవించడం, హిందూ దేవాలయాలకు వెళ్లడం ఏమాత్రం ఇష్టం లేదని వ్యాఖ్యలు చేశారు. ఒంటిమిట్ట శ్రీసీతారాముల కళ్యాణానికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించాల్సి ఉన్నా, కాలు బెణికిందనే సాకుతో వెళ్లకుండా ఉండిపోయారని అన్నారు. మరోపక్క టీడీపీ పార్టీ నేతలు సైతం జగన్ తీరు ఫై మండిపడుతున్నారు.
ఒంటిమిట్టకు వెళ్లకుండా జగన్ కుంటిసాకులు చెప్పారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. గన్ కాలు బెణికింది అనేది ఓ సాకు మాత్రమేనని ఆయన అన్నారు. సతీసమేతంగా వెళ్లాలి కాబట్టే జగన్ ఒంటిమిట్టకు వెళ్లలేదని అచ్చెన్న విమర్శించారు. గురువారం కార్యక్రమాల్లో జగన్ చక్కగా పాల్గొన్నారని, ఒంటిమిట్ట కల్యాణం అంటేనే సీఎంకు కాలునొప్పి వచ్చిందా? అని నిలదీశారు.