భారీ వర్షాలు..రూ.2000 కోట్ల సాయం కోరిన సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు
షిమ్లా: భారీ వర్షాలు, వరదలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమైన విషయం తెలిసిందే. అయితే సాయం కింద రెండు వేల కోట్లు ఇవ్వాలని ఆ రాష్ట్ర సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు కేంద్రాన్ని కోరారు. తాత్కాలిక సహాయం కింద ఆ అమౌంట్ ఇవ్వాలని అభ్యర్థించారు. వరద బాధితులకు ఇచ్చే నష్టపరిహారాన్ని కూడా పెంచనున్నట్లు ఆయన చెప్పారు. వారం క్రితం భారీ నుంచి అతి భారీ వర్షాలు హిమాచల్ను కుదిపేసిన విషయం తెలిసిందే. దీంతో అన్ని నదులూ ఉప్పొంగాయి.రోడ్లు కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో సీఎం అమిత్ షాతో మాట్లాడానని, తాత్కాలిక రిలీఫ్గా రెండు వేల కోట్లు ఇవ్వాలని షాను కోరినట్లు సుఖు తెలిపారు.
రాష్ట్రంలో వర్షాల వల్ల సుమారు నాలుగు వేల కోట్ల నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రతి బాధిత కుటుంబానికి లక్ష నష్టపరిహారం ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. అయితే ఆ పరిహారాన్ని పెంచనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ప్రతి బాధితుడికి 5వేలు ఇస్తున్నారు. డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ను ఏర్పాటు చేశామని, తమ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక నెల జీతాన్ని విరాళం ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు.