ఎన్టీఆర్ వర్ధంతి..గుడివాడలో తీవ్ర ఉద్రిక్తత

high-tension-in-gudivada

గుడివాడః నేడు ఎన్టీఆర్ వర్ధంతి నేపథ్యంలో గుడివాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దివంగత ఎన్టీఆర్ కు నివాళి అర్పించేందుకు ఆయన విగ్రహం వద్దకు వెళ్తున్న టిడిపి, జనసేన శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. విగ్రహం వద్దకు వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. విగ్రహం వద్దకు వెళ్లకుండా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు – టిడిపి, జనసేన శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది.

ఈ సందర్భంగా పోలీసులపై గుడివాడ టిడిపి ఇన్ఛార్జీ వెనిగండ్ల రాము ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహం వద్దకు వెళ్లేందుకు కొడాలి నానిని అనుమతించి… తమను మాత్రం ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన తర్వాతే ఇక్కడి నుంచి వెళ్తామని చెప్పారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు, ఈ విషయం గురించి తెలుసుకున్న టిడిపి, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.