రామమందిరం పై స్మారక పోస్టల్‌ స్టాంప్‌లను విడుదల చేసిన ప్రధాని మోడీ

PM Modi releases postal stamp on Ayodhya Temple

న్యూఢిల్లీః శ్రీరామ జన్మభూమి ఆలయం పై రూపొందించిన స్మారక పోస్టల్‌ స్టాంప్‌లను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు విడుదల చేశారు. దీంతోపాటు రాముడి చిత్రంతో కూడిన స్టాంపుల పుస్తకాన్ని కూడా ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించారు. ప్రధాని మోడీ మొత్తం ఆరు తపాలా స్టాంపులను విడుదల చేశారు. వీటిలో రామాలయం, గణేశుడు, హనుమంతుడు, జటాయువు, కేవత్రాజ్, మా శబరి ఉన్నాయి. అదేవిధంగా స్టాంపులతో కూడిన పుస్తకాన్ని కూడా ప్రధాని ఆవిష్కరించారు. ఈ 48 పేజీల పుస్తకంలో యూఎస్‌, సింగపూర్‌, కెనడా, కంబోడియా సహా 20 కంటే ఎక్కువ దేశాలు విడుదల చేసిన పోస్టల్‌ స్టాంపులు ఉన్నాయి. స్టాంపుల విడుదల సందర్భంగా ప్రధాని దేశ ప్రజలకు సందేశం కూడా ఇచ్చారు.

ఈ సందర్భంగా ప్రధాన మోడీ మాట్లాడారు. ”నమస్కారం రామ్ రామ్.. ‘ఈ రోజు శ్రీరామమందిరం ప్రాణ ప్రతిష్టా అభియాన్‌ నిర్వహించిన మరో కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు లభించింది. శ్రీరామ జన్మభూమి మందిర్‌పై రూపొందించిన ఆరు స్మారక పోస్టల్‌ స్టాంప్స్‌, ఆల్బమ్‌ విడుదలైంది. దేశ ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామభక్తులందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు.