హైదరాబాద్ వాసులకు మరో హెచ్చరిక
హైదరాబాద్ నగరవాసులకు మరో హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. మరో రెండు , మూడు గంటల్లో భారీ వర్షం పడనున్నట్లు ప్రకటించింది. గత నాల్గు రోజులుగా ఎడతెరిపి లేకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షం పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యముగా హైదరాబాద్ లో వర్షం ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా దంచికొడుతుండడం తో నగరవాసులు బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారగా, ఉస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది.
ఇదిలా ఉండగానే మరో రెండు , మూడు గంటల్లో హైదరాబాద్ లో భారీ వర్షం పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని ప్రభుత్వం మెచ్చరిస్తోంది. అలాగే ఈరోజు , రేపు ప్రభుత్వ కార్యాలయాలు అన్నిటికీ సెలవు ప్రకటించింది. ప్రైవేటు కార్యాలయాలూ సెలవులు ప్రకటించేలా కార్మిక శాఖకు ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలో నాలుగు జిల్లాలకు వాతావరణ శాఖ తాజాగా రెడ్ అలర్ట్ ప్రకటించింది. 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.