ఒడిశాలో పట్టాలు తప్పిన గూడ్సు రైలు..ముగ్గురు మృతి

ఒడిశాలోని జాజ్‌పూర్‌ జిల్లా కొరాయి రైల్వే స్టేషన్‌లో గూడ్సు రైలు పట్టాలు తప్పి ప్లాట్‌ఫామ్‌ పైకి దూసుకవచ్చింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా , పలువురికి గాయాలు అయ్యాయి. సోమవారం తెల్లవారు జామున ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ..సోమవారం ఉదయం 6.44 గంటలకు కొరాయి స్టేషన్‌లో గూడ్సు రైలు పట్టాలు తప్పింది. మొత్తం 54 బోగీల్లో 10 బోగీలు బోల్తాపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదం కారణంగా రెండు రైలు మార్గాలు నిలిచిపోయాయని రైల్వే అధికారులు తెలిపారు. స్టేషన్ భవనం కూడా దెబ్బతింది. సహాయక బృందాలు, రైల్వే అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గూడ్స్ రైలు ప్లాట్‌ఫామ్‌కు ఒక్కసారిగా రావడంతో ప్రయాణికులు పరుగులు పెట్టారు. ఈ ప్రమాదంలో పది బోగీలు బోల్తా పడ్డాయి. పలువురు ప్రయాణికులు బోగీల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని జాజ్‌పూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)లో చేర్పించారు.