ఉపాధ్యాయుల బ‌దిలీల‌పై తెలంగాణ సర్కార్ కీల‌క నిర్ణ‌యం

ఉపాధ్యాయుల బ‌దిలీల‌పై తెలంగాణ సర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఉపాధ్యాయుల బదిలీల్లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. 317 జీఓ కింద వేరే జిల్లాకు బదిలీ అయిన టీచర్ల పూర్వజిల్లా సర్వీసును పరిగణనలోకి తీసుకొని ఉపాధ్యాయ బదిలీలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇప్ప‌టికే ప్రారంభ‌మైన ఉపాధ్యాయుల బ‌దిలీలు, ప‌దోన్న‌తుల ప్ర‌క్రియ కొన‌సాగుతుంద‌ని జీవో 317 కింద బదిలీ అయిన ఉపాధ్యాయులు తాజాగా ఆన్‌లైన్‌లో ద‌రఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 12 ఉంచి 14వ తేదీ వ‌ర‌కు అవ‌కాశం క‌ల్పించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఉపాధ్యాయులంద‌రికీ స‌మ‌న్యాయం చేకూర్చాల‌నే ఉద్దేశంతో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని మంత్రి పేర్కొన్నారు. ఇప్ప‌టికే వ‌చ్చిన 59 వేల ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న పూర్తి చేయ‌బ‌డుతంద‌ని స‌బితా ఇంద్రారెడ్డి తెలిపారు.

రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ జరుగుతోంది. ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, లాంగ్వేజి పండిట్లను బదిలీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, బదిలీలకు సంబంధించిన నిబంధనల్లో కనీసం ఒకచోట రెండేళ్లు పనిచేసిన వారు మాత్రమే బదిలీకి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల ఉమ్ముడి జిల్లాల నుంచి కొత్త జిల్లాలకు 317 జీవో ప్రకారం బదిలీ అయిన వారికి రెండేళ్ల సర్వీసు పూర్తి లేదు. దీంతో తాము ఉమ్మడి జిల్లా నుంచి కొత్త జిల్లాకు వచ్చామని, ఉమ్మడి జిల్లాలోని సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకోవాలని వారు గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వారి అభ్యర్థనను పరిశీలించి, ఇలాంటి ఉపాధ్యాయులు దాదాపు 25 వేల మంది ఉన్నందున ప్రభుత్వం పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది.