వేములవాడ కూడా మరో యాదాద్రి కాబోతుంది
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి టెంపుల్ ను ఎంతగా అభివృద్ధి చేసిందో చెప్పాల్సిన పనిలేదు. కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆలయ రూపురేఖలే మార్చారు. తెలంగాణ తిరుపతి గా ఇప్పుడు అంత యాదాద్రి ని పిలుస్తున్నారు. తెలంగాణ నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా ప్రతి రోజు పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు వేములవాడ రాజన్న ఆలయాన్ని సైతం యాదాద్రి తరహాలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.
మంగళవారం వేములవాడ ఎమ్మెల్యే రమేశ్ బాబు, సంబంధిత అధికారులతో కలిసి మంత్రి కేటీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వేములవాడ ఆలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. మహా శివరాత్రికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు, వసతులు కల్పించాలన్నారు. వేములవాడ జాతరకు సౌకర్యాలు కల్పించేందుకు అదనపు నిధులు కేటాయిస్తాం. జాతరలో సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలి. రాష్ట్ర సాంస్కృతిక శాఖతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు కేటీఆర్ సూచించారు.