కుషాయిగూడ లో విషాదం : ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ దంప‌తులు

కుషాయిగూడ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని కందిగూడ‌లో విషాదం చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్ జాబ్స్ చేస్తున్న దంపతులు తమ ఇద్దరు పిల్లలను చంపి , ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..కందిగూడ‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే దంపతులు స‌తీష్‌, వేద లు సాఫ్ట్‌వేర్ జాబ్స్ చేస్తూ జీవితాన్ని ముందుకు సాగిస్తున్నారు. ఈ దంప‌తుల‌కు నిషికేత్‌(9), నిహాల్‌(5) అనే ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. అయితే ఇద్ద‌రు పిల్ల‌ల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు.

తమ కళ్లముందే పిల్లలు ఇద్దరు అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడం చూడలేకపోయారు. వారిని చంపేసి , వారు కూడా చనిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. ముందుగా పిల్ల‌ల‌కు పొటాషియం సైనేడ్ ఇచ్చి, ఆ త‌ర్వాత దంప‌తులిద్ద‌రూ కూడా అదే సైనేడ్‌ను తీసుకున్నారు. దీంతో న‌లుగురు చ‌నిపోయారు. స‌మాచారం అందుకున్న కుటుంబ స‌భ్యులు, పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృత‌దేహాల‌ను గాంధీ ఆస్ప‌త్రి మార్చురీకి త‌ర‌లించారు.