మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడిపై మరో కేసు నమోదు

బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడి ఫై పోలీసులు మరో కేసు నమోదు చేసారు. ఇప్పటికే ప్రజా భవన్ వద్ద గేటును ధ్వసం చేసిన కేసులో ఇతడు నిందితుడిగా ఉండగా..ఇప్పుడు రెండేళ్ల క్రితం జరిగిన ఆక్సిడెంట్ కేసులో ఇతడిని నిందితుడిగా తెలుస్తూ కేసు నమోదు చేసారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.45లో రెండేళ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కారు నడిపింది రాహిల్ అని తాజాగా నిర్ధారించిన పోలీసులు అతడు నిందితుడిగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సెక్షన్లను మార్చి తిరిగి దర్యాప్తు ప్రారంభించారు.

2022 ఫిబ్రవరి 17వ తేదీ రాత్రి 8 గంటల ప్రాంతంలో ఓ ముగ్గురు మహిళలు ఓ పసికందుతో డివైడర్‌ దాటుతుండగా ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురూ గాయపడగా చిన్నారి మృతి చెందాడు. ఈ ఘటన తర్వాత కారులోని ముగ్గురు యువకులూ పరారయ్యారు. ఆ వాహనంపై అప్పటి బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ పేరుతో స్టిక్కర్‌ ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు నాలుగు బృందాలను ఏర్పాటుచేసి దర్యాప్తు చేయగా.. అప్పట్లో కారు నడిపింది తానేనంటూ ఆఫ్రాన్‌ అనే యువకుడు పోలీసుల ముందు లొంగిపోయి కారులో తనతోపాటు రాహిల్‌, స్నేహితుడు మహమ్మద్‌ మాజ్‌ ఉన్నట్లు అంగీకరించాడు. దీంతో ఆ ఇద్దరి పేర్లనూ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. కానీ ఇప్పుడు ప్రజా భవన్ కేసులో జరిగిన పరిణామాలు దృష్ట్యా….గతంలో జరిగిన ఆక్సిడెంట్ కేసును బయటకు తీయగా అందులో రాహులే ఆ ప్రమాదం చేసినట్లు తేలడంతో కేసు నమోదు చేసారు.