రాష్ట్ర గవర్నర్ ను కలిసిన సీఎం జగన్ దంపతులు

గురువారం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా కలిశారు. రాజ్భవన్లో గవర్నర్ దంపతులను కలిసిన సీఎం దంపతులు వారికి పుష్పగుచ్ఛం, జ్ఞాపికను అందజేసి సత్కరించారు. గవర్నర్, సీఎంలు సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలపై చర్చించారు. అనంతరం సీఎం వైయస్ జగన్ దంపతులను గవర్నర్ దంపతులు శాలువాతో సత్కరించి జ్ఙాపికను అందజేశారు.
అంతకుముందు, తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అనంతపురం జిల్లాలో కురిసిన భారీ వర్షాలపై సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. వర్షాలు, వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి అధికారులు ఆసరాగా నిలవాలని స్పష్టం చేశారు. వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఆస్తి నష్టం, పంట నష్టం అంచనాలు తయారుచేయాలని ఆదేశించారు. నిర్ణీత సమయంలోగా బాధితులకు పరిహారం అందించడంపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వరద బాధిత కుటుంబాలకు రూ.2వేల చొప్పున తక్షణ సహాయం అందించాలని ఆదేశించారు. అలాగే బియ్యం, పామాయిల్, కందిపప్పు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు ఈ ఐదు రకాల నిత్యావసర వస్తులను ప్రతి బాధిత కుటుంబానికి చేరవేయాలని సీఎం ఆదేశించారు.