ఆదిలాబాద్ జిల్లా రాంపూర్‌లో ఉద్రిక్తత

ఆదిలాబాద్ జిల్లా రాంపూర్ లో ఉద్రిక్తత నెలకొంది. రేణుక సిమెంట్ ఫ్యాక్టరీకి ఇచ్చిన భూములు తమకు తిరిగి ఇవ్వాలని పురుగుమందు డబ్బాలతో రైతులు ఆందోళనకు దిగారు. అంతటితో ఆగకుండా ఎండ్ల బండ్లతో ఫ్యాక్టరీ భూముల వరకు ర్యాలీ నిర్వహించడం ఉద్రిక్తత కు దారి తీసింది. అయితే.. భూ నిర్వాసితులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో భూ నిర్వాసితులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. రేణుక సిమెంట్ ఫ్యాక్టరీకి ఇచ్చిన భూములు స్వాధీనం చేసుకోవడానికి అనుమతినివ్వాలని ఆందోళనకారులు పోలీసులను కోరారు. జీవో నెంబర్ 40 ప్రకారం మూడేళ్లలో ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేసి, నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదని మండిపడ్డారు.

ఆదివాసీల అక్రమ అరెస్ట్‌లను తీవ్రంగా ఖండించారు ఆదిలాబాద్ తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు గణేష్. జిల్లా వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సుమోటోగా తీసుకోని కేసు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు తుడుందెబ్బ నేతలు.