నేడు ఉక్రెయిన్ నుంచి రానున్న 3,700 మంది విద్యార్థులు

ఆపరేషన్ గంగా కార్యక్రమం ఉద్ధృతం

న్యూఢిల్లీ: గురువారం ఉక్రెయిన్ నుంచి పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులు బయటపడనున్నారు. ఆపరేషన్ గంగా కార్యక్రమం కింద.. 19 విమాన సర్వీసులతో 3,726 మంది విద్యార్థులను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విమాన సర్వీసులను ఉక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి నడిపించనున్నారు. ఉక్రెయిన్ గగనతలాన్ని మూసివేయడం తెలిసిందే. విద్యార్థులను రోడ్డు మార్గంలో సరిహద్దులు దాటించి, అక్కడికి సమీపంలోని విమానాశ్రయాలకు తరలిస్తారు. అక్కడి నుంచి నేరుగా భారత్ కు విమానాల్లో చేరవేయనున్నారు.

8 విమానాలు బుకారెస్ట్ నుంచి, రెండు విమాన సర్వీసులు సుసేవ నుంచి, కోసీ నుంచి ఒకటి, బుడాపెస్ట్ నుంచి ఐదు, రెస్జోవ్ నుంచి 3 విమాన సర్వీసులు బయల్దేరతాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ప్రధాని మోడీజీ ఆదేశాలతో ఒక్కరోజే 3,726 మందిని తరలిస్తున్నట్టు చెప్పారు. జ్యోతిరాదిత్య, మరో మంత్రి కిరణ్ రిజుజు తదితరులతో కూడిన ఉన్నతస్థాయి బృందాన్ని సహాయక చర్యల పర్యవేక్షణ కోసం కేంద్రం పంపడం తెలిసిందే.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/