బిజెపి మాజీ ఎమ్మెల్సీ పీవీ చలపతిరావు కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ పీవీ చలపతిరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వైజాగ్ లోని పికినాల్ హాస్పటల్ లో చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. పీవీ చలపతిరావు మరణం పట్ల పలువురు సంతాపం తెలిపారు.

పీవీ చలపతిరావు ఆకస్మిక మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బిజెపి పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసి చలపతిరావు తనకు మార్గదర్శకులుగా నిలిచారని.. ఆయన మరణం తీరని లోటని సోము ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. కార్మిక సంఘం నాయకుడిగా, విశాఖ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం ఎమ్మెల్సీగా చలపతిరావు అందించిన సేవలు చిరస్మరణీయం అని సోము వీర్రాజు తెలిపారు. రాష్ట్రంలో ఆనాటి జనసంఘ్‌ పార్టీ అభివృద్ధికి కృషిచేసిన ప్రముఖుల్లో ఆయన ఒకరని తెలిపారు.

కాంగ్రెస్‌ పార్టీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా చలపతిరావు చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని సోము వీర్రాజు ప్రకటనలో తెలిపారు.