అందుకే వాసిరెడ్డి పద్మ చాలా చురుగ్గా పనిచేస్తోంది : వంగలపూడి అనిత

ఇప్పటికే వాసిరెడ్డి పదవీకాలం అయిపోయిందంటూ వ్యాఖ్యలు

vangalapudi-anitha-satires-on-vasireddy-padma

అమరావతిః ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మపై టిడిపి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. ఈ మధ్య వాసిరెడ్డి పద్మ చాలా యాక్టివ్ గా పనిచేస్తోందని వ్యంగ్యం ప్రదర్శించారు. సోషల్ మీడియాలో వైఎస్ భారతి రెడ్డిపై చిన్న పోస్టు పెట్టినా చాలు… సదస్సులు, సమావేశాలు ఏర్పాటు చేస్తూ హడావిడి చేస్తోందని అన్నారు. వాసిరెడ్డి పద్మ ఉన్నట్టుండి ఇంత చురుగ్గా పనిచేయడానికి అసలు కారణం ఏంటో తనకు నిన్ననే తెలిసిందని వెల్లడించారు. “వాసిరెడ్డి పద్మ పదవీకాలం అయిపోయిందట. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే అయినా పదవిని పొడిగిస్తారేమోనని ఆశ. అయిపోయిన పెళ్లికి బాజాలు వాయిస్తున్నట్టుంది. అందుకేనేమో… పదవీకాలం ముగిసినప్పటికీ పవన్ కల్యాణ్ కు నోటీసులు ఇచ్చింది.

ఆమె ఇటీవల కొన్ని సెమినార్లు నిర్వహించింది. ప్రతి శుక్రవారం మహిళా ఆత్మగౌరవ దినం అని ఒక దినాన్ని ప్రకటించింది. ఆ దినం రోజున ఆడవాళ్లందరినీ కూర్చోబెట్టి ప్రసంగాలు ఇస్తోంది. ఏదో సంవత్సరానికి ఒకసారి అయితే అందరూ చేస్తారు. కానీ ప్రతి శుక్రవారం మహిళల ఆత్మ గౌరవ దినం అంట. ఆ రోజైనా గానీ… మహిళలపై అఘాయిత్యాల మీదనో, సైబర్ నేరాల మీదనో, సోషల్ మీడియా ధోరణులపైనో మాట్లాడితే బాగుంటుంది. కానీ ఈ రాష్ట్రంలో వైఎస్ భారతి ఒక్కరే ఆడవాళ్లు అయినట్టు, ఆమె మీద పోస్టులు పెట్టిన అంశాలపైనే మాట్లాడుతోంది” అంటూ అనిత విమర్శించారు.