ఊమెన్ చాందీ భౌతికకాయానికి నివాళ్లు అర్పించిన సోనియా , రాహుల్

అనారోగ్యం తో కన్నుమూసిన కేరళ మాజీ సీఎం , కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ భౌతికకాయానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు నివాళులర్పించారు. గత కొద్దీ రోజులుగా అనారోగ్యం తో బాధపడుతున్న ఊమెన్ చాందీ బెంగళూరు లోని చిన్మయ మిషన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున 4.25 గంటలకు మృతి చెందారు. గతంలో గొంతు సమస్యలతో ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. అనంతరం ఉత్తమ చికిత్స కోసం బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం విషమం కావడం తో ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఈయన మరణ వార్త తెలిసి కాంగ్రెస్ శ్రేణులు , ఇతర రాజకీయ పార్టీల నేతలు ఆయనకు సంతాపం తెలిపారు.

కొద్దీ సేపటి క్రితం బెంగళూరులోని ఊమెన్ చాందీ నివాసానికి వెళ్లిన సోనియా, రాహుల్ లు ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారితోపాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఊమెన్ చాందీకి నివాళులర్పించారు. ఊమెన్‌ చాందీ 1943 అక్టోబరు 31న కొట్టాయం జిల్లాలోని కుమరకోమ్ గ్రామంలో జన్మించారు. సాధారణ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన చాందీ.. తన నిజాయతీ, చిత్తశుద్ధితో పార్టీ అధినాయకత్వానికి విశ్వాసపాత్రుడిగా నిలిచారు. 27 ఏళ్ల వయసులో పూతుపల్లి నుంచి 1970లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. తర్వాత ఎన్నడూ వెనుదిరిగి చూసుకోలేదు. ఆయన 12 సార్లు ఎమ్మెల్యేగా గెలవగా.. అన్నిసార్లూ పూతుపల్లి నియోజకవర్గం నుంచే విజయం సాధించారు. చాందీ 1977లో కె.కరుణాకరన్‌ కేబినెట్‌లో తొలిసారిగా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.