‘రాష్ట్రపత్ని’ వ్యాఖ్యలపై పార్లమెంటులో దుమారం
ముర్ముకు క్షమాపణ చెప్పాలన్న స్మృతి ఇరానీ..బిజెపి ఎంపీల ఆందోళన
న్యూఢిల్లీః కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్ సభ సభ్యుడు అధిర్ రంజన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అనుచిత కామెంట్ చేశారు. ద్రౌపది ముర్మును ఆయన ‘రాష్ట్రపత్ని’ అని సంబోధించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. పార్లమెంటు ఆవరణలో బీజేపీ ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ముర్ముకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అధిర్ రంజన్ చౌధురిపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు.
దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవిని చేపట్టిన మహిళను కించపరిచేందుకు కూడా తన పార్టీ నేతలకు సోనియాగాంధీ అవకాశం ఇచ్చారని స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ… ఆదివాసీ వ్యతిరేకి, దళిత వ్యతిరేకి, మహిళా వ్యతిరేకి అని మండిపడ్డారు. సోనియా నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నేతలు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న మహిళలను కించపరచడం కొనసాగుతూనే ఉందని అన్నారు. రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళ ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ పార్లమెంటులోనే కాకుండా దేశంలోని వీధుల్లో కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే తరపున ద్రౌపది ముర్మును అభ్యర్థిగా ఎంపిక చేసినప్పటి నుంచి ఆమెను కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసిందని స్మృతి ఇరానీ అన్నారు. ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత కూడా ఆమెపై దాడి ఆగలేదని మండిపడ్డారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/