కేసీఆర్ తనకు తానే చాలా గొప్ప వ్యక్తిగా ఊహించుకుంటాడంటూ ఈటెల ఎద్దేవా

etela-rajender-accuses-brs-for-party-chief-and-cm-posts

బిజెపి నేత , హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మరోసారి బిఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఫై విరుచుకపడ్డారు. కేసీఆర్ తనకు తానే చాలా గొప్ప వ్యక్తిగా ఊహించుకుంటాడంటూ ఎద్దేవా చేసారు. మంగళవారం మీట్ ది ప్రెస్ లో భాగంగా బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మాట్లాడిన ఈటల.. నిజాలెప్పుడూ కేసీఆర్ కు మింగుడు పడవని అన్నారు. వాస్తవాలను తెలుసుకునేందుకు కూడా ఆయనెప్పుడూ ఆసక్తి చూపించరంటూ ముఖ్యమంత్రి తీరుపట్ల అసహనం వ్యక్తం చేశారు. ‘కాళ్ల కింద భూమి కదులుతున్న విషయాన్ని కేసీఆర్ గ్రహించటం లేదు. వాస్తవాలు చెబితే కేసీఆర్ దబాయింపుతో వ్యవహరిస్తారు. నీళ్లు, నియామకాల విషయంలో ముఖ్యమంత్రి పూర్తిగా విఫలమయ్యారు. ఒక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు’ అంటూ దుయ్యబట్టారు.

‘బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటైతే నేను గజ్వేల్ లో ఎందుకు పోటీ చేస్తాను? బీజేపీ, బీఆర్ఎస్ గతంలో‌ ఎప్పుడూ కలసి పోటీ చేయలేదు. బీజేపీపై విష ప్రచారం చేస్తున్నారు. మా మధ్య ఏ ఒప్పందం లేదు. ఇవన్నీ ఆధారంలేని పుకార్లే’ అని కొట్టిపారేశాడు. చివరగా బీఆర్ఎస్ ను నిలువరించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందన్న ఆయన.. హంగ్ వస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని, గతంలో కలసి పనిచేసిన చరిత్ర కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఉన్నాయని ఈటెల గుర్తు చేసారు.