కెసిఆర్ పాలనలో బిఆర్ఎస్ కార్యకర్తలకే దళితబంధు దక్కిందిః ఈటల రాజేందర్

ప్రభుత్వమే స్వయంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది.. ఈటల

etela-rajender

హైదరాబాద్‌ః కాంగ్రెస్ పార్టీ ఆరోపించినట్లుగా బిజెపి, బిఆర్ఎస్ ఒక్కటే అయితే గజ్వేల్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ పై తాను ఎందుకు పోటీ చేస్తానని హుజూరాబాద్ ఎమ్మెల్యే, బిజెపి నేత ఈటల రాజేందర్ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… కెసిఆర్ పాలనలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే బీసీ బంధు దక్కిందన్నారు. కెసిఆర్ పాలనలో దళితులు, బీసీలు, రైతులతో పాటు ఎవరూ సంతోషంగా లేరని విమర్శించారు. అసైన్డ్, ప్రభుత్వ భూములను అమ్ముకుంటున్నారన్నారు. ప్రభుత్వమే స్వయంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందన్నారు.

మరోపక్క, లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తున్నారని దుయ్యబట్టారు. బిఆర్ఎస్ పాలనలో ప్రజలు విసిగిపోయారన్నారు. బిఆర్ఎస్‌ను గద్దె దించడమే బిజెపి లక్ష్యమన్నారు. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే బిజెపికి ఓటు వేసి అధికారంలోకి తీసుకు రావాలన్నారు. ప్రతిపక్ష పాత్ర పోషించాలని గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే వారు బిఆర్ఎస్‌లో చేరారన్నారు.