ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు మావోయిస్టులు మృతి

encounter

న్యూఢిల్లీ : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో బుధవారం భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. మాడేడ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కూంబింగ్‌ నిర్వహిస్తున్న బలగాలకు మావోయిస్టులు తారసపడటంతో ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఘటనా ప్రాంతంలో భద్రతాసిబ్బంది ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, తాజాగా మరణించిన ఇద్దరితో కలిపి ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పటివరకు ఎన్‌కౌంటర్‌లలో మృతిచెందిన మావోయిస్టుల సంఖ్య 118కి చేరింది. మే 23న నారాయణ్‌పూర్‌-బీజాపూర్‌ జిల్లాల సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కూడా ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు.

మే 10న బీజాపూర్‌ జిల్లాలో చోటుచేసుకున్న భారీ ఎన్‌కౌంటర్‌లో 10 మంది మావోయిస్టులు మరణించారు. అంతకుముందు ఏప్రిల్‌ 30న నారాయణ్‌పూర్‌-కాంకేర్‌ జిల్లాల సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సలైట్‌లు మృతిచెందారు. ఏప్రిల్‌ 16న కాంకేర్‌ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఏకంగా 29 మంది మావోయిస్టులు మరణించారు.