కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇంట విషాదం

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇంట విషాద ఛాయలు అల్లుకున్నాయి. కిషన్‌రెడ్డి మేనల్లుడు జీవన్‌రెడ్డి (51) గురువారం గుండెపోటుతో కన్నుమూశారు. సైదాబాద్‌లోని వినయ్‌నగర్‌ కాలనీలో ఉంటున్న జీవన్‌రెడ్డి గురువారం సాయంత్రం ఇంట్లో ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబసభ్యులు ఆయనను కంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీఓ అపోలో ఆస్పత్రికి తరలించగా..ఆయన్ను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

జీవన్‌రెడ్డికి భార్య ఉమా, ఇద్దరు కుమారులున్నారు. కిషన్‌రెడ్డి పెద్దక్క లక్ష్మీ-నర్సింహారెడ్డి దంపతుల కుమారుడైన జీవన్‌రెడ్డి స్వస్థలం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఆకుల మైలారం. జీవన్‌రెడ్డి మృతి విషయం తెలుసుకున్న రంగారెడ్డి జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆస్పత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.