జూన్ 9న సీఎంగా మరోసారి జగన్ ప్రమాణస్వీకారం చేస్తారు: సజ్జల

Sajjala Ramakrishna Reddy
Sajjala Ramakrishna Reddy

అమరావతిః ఆంధ్రప్రదేశ్ లో మరోసారి అధికారంలోకి రాబోతున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ సీపీ) ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కౌంటింగ్ ఏజెంట్ల వర్క్ షాప్ లో ఆయన మాట్లాడారు. పార్టీ అధికారంలోకి వచ్చే విషయంలో ఎలాంటి అనుమానం లేదన్నారు. జూన్ 9న సీఎంగా మళ్లీ వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని పునరుద్ఘాటించారు.

వారం రోజుల తర్వాత రాష్ట్రానికి టీడీపీ పీడ విరగడవుతుందని వ్యాఖ్యానించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు తమకే పడ్డాయని టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నా తాము మాత్రం ఫలితాల ముందు తాత్కాలిక ఆనందాల జోలికి వెళ్లడం లేదని చెప్పారు. అయితే కౌంటింగ్ రోజు పార్టీ ఏజెంట్లంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం కౌంటింగ్‌ ప్రక్రియ జరిగేలా చూడాలని కోరారు. ప్రత్యర్థి పార్టీల ఏజెంట్ల ఆటలు సాగనివ్వరాదని పేర్కొన్నారు.