బిహార్‌ లో కరెంట్ కోతలకు నిరసన తెలుపుతున్న ఆందోళనకారులపై కాల్పులు

బీహార్ లోని కటిహార్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ కోతలకు నిరసన తెలుపుతున్న ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా , మరికొంతమంది గాయపడ్డారు.

కటిహార్‌లోని బార్సోయి ప్రాంతంలో కరెంట్‌ కోతలు, విద్యుత్ టారిఫ్‌లను నిరసిస్తూ గ్రామస్థులు ఆందోళన బాట పట్టారు. స్థానిక విద్యుత్‌ కార్యాలయాన్ని ముట్టడించి, ఆఫీసుపైకి రాళ్లు విసిరి అక్కడి సామగ్రిని ధ్వంసం చేశారు. ఈ విషయం తెలిసి పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఆందోళనకారులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఆందోళన కారులు ఎక్కడ తగ్గకపోవడం తో పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. దీంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. పోలీసులు, గ్రామస్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు కాల్పులు జరుపగా..ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయపడ్డారు. కాల్పుల్లో మరణించిన వ్యక్తిని 34 ఏళ్ల ఆలంగా గుర్తించారు.