కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో కొలువులకు నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార పార్టీ బిఆర్ఎస్ వరాల జల్లు కురిపిస్తుంది. ఓ పక్క సంక్షేమ పధకాలు అందిస్తూనే..మరోపక్క నిరుద్యోగులకు వరుస నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పలు విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్లను జారీ చేసిన సర్కార్..తాజాగా కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో 1,520 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల నియామకానికి బుధవారం సాయంత్రం నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
ఆగస్టు 25 ఉదయం 10.30 గంటల నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నట్లు పేర్కొంది. సెప్టెంబర్ 19 సాయంత్రం 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. హెల్త్ అండ్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో జాబ్ మేళా కొనసాగుతుందంటూ మంత్రి హరీశ్రావు ట్వీట్ చేశారు. కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో 1,520 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసిందన్న ఆయన.. ఆశావహులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
నోటిఫికేషన్ తాలూకా ప్రధాన అంశాలు :
అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర నర్సెస్, మిడ్వైఫ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన సంస్థలో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (మహిళ) ట్రైనింగ్ కోర్సు పాసై ఉండాలి. లేదంటే ఇంటర్ ఒకేషనల్ మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ఫిమేల్) ట్రైనింగ్ కోర్సును అభ్యసించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏడాది పాటు క్లినికల్ ట్రైనింగ్ చేసి ఉండాలి.
అభ్యర్థుల వయసు 2023 జులై 1 నాటికి 18 నుంచి 44ఏళ్లు మించరాదు. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, ఎక్స్సర్వీస్మెన్, ఎన్సీసీ సర్టిఫికెట్ ఉన్నవారికి మూడేళ్లు చొప్పున వయో పరిమితి సడలింపు కల్పించారు.
హెల్త్ అసెస్టెంట్ పోస్టులకు ఎంపికైన వారికి వేతన స్కేలు నెలకు రూ.31,040- 92,050గా నిర్ణయించారు.
దరఖాస్తు రుసుం: ఆన్లైన్ దరఖాస్తు రుసుం రూ.500. దానికి అదనంగా ప్రాసెసింగ్ ఫీజు రూ.200ల చొప్పున చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్/దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్లతో పాటు 18-44 ఏళ్లు కలిగిన నిరుద్యోగ కేటగిరీ అభ్యర్థులకు ప్రాసిసింగ్ ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
ఓఎంఆర్ లేదా కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్షకు సంబంధించిన వివరాలను తర్వాత వెల్లడించనున్నారు. పరీక్ష ఇంగ్లిష్లోనే ఉంటుంది. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్లను ప్రాథమికంగా పరీక్ష కేంద్రాలుగా నిర్ణయించారు.