వచ్చే ఎన్నికల ఫలితాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తాయిః రాహుల్ గాంధీ

ఎన్నికల్లో బిజెపిని విపక్షాలు ఓడిస్తాయన్న రాహుల్ గాంధీ

election-results-will-surprise-people-says-rahul-gandhi

వాషింగ్టన్: దేశంలో ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా ఉన్నాయని.. వచ్చే ఎన్నికల్లో బిజెపిని ఓడిస్తాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుందని, ఎన్నికల ఫలితాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తాయని చెప్పారు. విపక్ష పార్టీలతో కాంగ్రెస్ రెగ్యులర్ గా చర్చలు జరుపుతోందని అన్నారు. రాహుల్ గాంధీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. వాషింగ్టన్ లో నేషనల్ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల సమయానికి విపక్షాలతో మహా కూటమి ఏర్పడుతుందనే నమ్మకం తనకు ఉందని రాహుల్ అన్నారు. అయితే విపక్ష పార్టీల మధ్య కొంత ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవసరమని చెప్పారు. తన లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం తనకే లబ్ధి చేకూరుస్తుందని అన్నారు. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఇది మంచి అవకాశాన్ని కల్పించిందని చెప్పారు. బిజెపి తనకు మంచి గిఫ్ట్ ఇచ్చిందని అన్నారు.

హత్యా బెదిరింపుల గురించి తాను ఆందోళన చెందనని రాహుల్ చెప్పారు. ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు చనిపోవాల్సిన వారేనని అన్నారు. తన నానమ్మ, తన తండ్రి నుంచి తాను ఇదే నేర్చుకున్నానని చెప్పారు. 1984లో ఇందిరాగాంధీని ఆమె బాడీగార్డ్స్ హత్య చేశారు. 1991లో రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ సూసైడ్ బాంబర్ పొట్టనపెట్టుకుంది.