కోచింగ్ సెంటర్లకు కేంద్ర విద్యాశాఖ నూతన మార్గదర్శకాలు జారీ
16 ఏళ్ల లోపు విద్యార్థులను చేర్చుకోవడానికి వీల్లేదని కోచింగ్ సెంటర్లకు స్పష్టం చేసిన కేంద్రం
న్యూఢిల్లీః పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి దోపిడీకి పాల్పడుతున్న కోచింగ్ సెంటర్లను నియంత్రించడమే లక్ష్యంగా కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. 16 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న విద్యార్థులను కోచింగ్ సెంటర్లు చేర్చుకోకూడదని గైడ్లైన్స్ స్పష్టం చేశాయి. పాఠశాల స్థాయి విద్య పూర్తయిన తర్వాత మాత్రమే ప్రవేశానికి అనుమతి ఇవ్వాలని సూచించాయి. మంచి ర్యాంకులు లేదా మార్కులు వస్తాయని నమ్మించే ప్రయత్నాలు చేయకూడదని కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు ఈ నూతన మార్గదర్శకాలు సూచించాయి. పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు, కోచింగ్ సెంటర్లలో సౌకర్యాల లేమి, అగ్నిప్రమాదాలు, బోధనా పద్ధతులపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ మార్గదర్శకాలు జారీ చేసింది.
ఫీజులు న్యాయబద్ధంగా, సహేతుకంగా ఉండాలని నూతన మార్గదర్శకాలు స్పష్టం చేశాయి. పారదర్శకంగా రసీదులు ఉండాలని పేర్కొన్నాయి. కోర్సుల నుంచి నిష్క్రమించే విద్యార్థులకు తిరిగి ఫీజు సర్దుబాటు చేయాల్సిన అవసరాన్ని కూడా ప్రస్తావించాయి. మౌలిక సదుపాయాలు, విద్యార్థికి కనీస స్థలం కేటాయింపు, ప్రథమ చికిత్స, వైద్య సౌకర్యాల ఏర్పాటు, విద్యుత్, వెంటిలేషన్, వెలుతురు, తాగునీరు, భద్రతా చర్యలు తప్పనిసరిగా ఉండాలని నూతన మార్గదర్శకాలు స్పష్టం చేశాయి. మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే సంబంధిత అధికారి కోచింగ్ సెంటర్ల రిజిస్ట్రేషన్ను రద్దు చేయవచ్చునని స్పష్టం చేశాయి. జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈ మార్గదర్శకాలు జారీ చేసింది.