అయోధ్య రామయ్య వద్దకు సిరిసిల్ల బంగారు చీర

ప్రధాని మోడీకి చీరను అందజేస్తామన్న సంజయ్

sircilla-gold-saree-going-to-ayodhya

హైదరాబాద్ః సిరిసిల్ల చేనేత కార్మికుడు హరిప్రసాద్ కు అరుదైన గౌరవం దక్కబోతోంది. ఆయన రూపొందించిన బంగారు చీరను అయోధ్యకు పంపిస్తున్నారు. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈ చీరను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ నెల 26న ప్రధాని మోడీకి ఈ చీరను అందిస్తామని తెలిపారు. శ్రీరాముడి పాదాల చెంతకు చీరను చేరుస్తామని చెప్పారు. మరోవైపు హరిప్రసాద్ మాట్లాడుతూ… 8 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండిని ఉపయోగించి 20 రోజుల్లో చీరను తయారు చేశామని తెలిపారు. శ్రీరాముడి చిత్రంతో పాటు రామాయణ ఇతివృత్తాన్ని తెలియజేసే చిత్రాలు ఈ చీరలో ఉన్నాయని వెల్లడించారు.

చీరకు సంబంధించిన చిత్రాలను బండి సంజయ్ తన ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేశారు. ప్రధానమంత్రి చేతుల మీదుగా శ్రీరాముడి వద్ద చీరను ఉంచేందుకు సిద్ధమవడం సంతోషంగా ఉందని చెప్పారు. గతంలో అగ్గిపెట్టెలో చీరను ఉంచిన చరిత్ర సిరిసిల్లదే అని కొనియాడారు. ఇంతటి గొప్ప నైపుణ్యాన్ని సొంతం చేసుకున్న చేనేత రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.