కరోనా భృతిపై దిగొచ్చిన ట్రంప్
900 బిలియన్ డాలర్ల బిల్లుపై ట్రంప్ సంతకం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కరోనా భృతిపై దిగొచ్చారు. 900 బిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీకి బిల్లుపై ట్రంప్ సంతకం చేశారు. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఉద్దీపన ప్యాకేజీ బిల్లును ట్రంప్ తెచ్చారు. కరోనా కారణంగా కుదేలైన వ్యాపార సంస్థలతో పాటు పౌరులకు ప్రయోజనం కలగనుంది. అమెరికా సంస్థలు, పౌరులకు వివిధ రూపాల్లో ప్యాకేజీ కింద ఆర్థిక భరోసా కల్పించనున్నారు.
కాగా ఇప్పటి వరకు ఇస్తున్న నిరుద్యోగ భృతికి శనివారం అర్ధరాత్రితో గడువు ముగియనుంది. ఆలోగా కొత్త బిల్లుపై ట్రంప్ సంతకం చేయాల్సి ఉంది. కానీ వారాంతాన్ని గడపడానికి ఫ్లోరిడా పామ్ బీచ్కి వెళ్లిన ట్రంప్… బిల్లుపై సంతకం చేయకపోగా కొత్త వాదన లేవనెత్తడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ట్రంప్ వైఖరితో దేశంలోని లక్షలాది మంది నిరుద్యోగులు అయోమయంలో పడ్డారు. కరోనా తెచ్చిన కష్టకాలంలో ఆర్థిక సహాయం అందజేసేందుకు ఉద్దేశించిన బిల్లుపై సంతకం చేయడానికి ట్రంప్ మీనమేషాలు లెక్కించారు. ఇల్లు గడిపేందుకు అవస్థలు పడుతున్న నిరుద్యోగులు… సకాలంలో సహాయం అందకపోతే రోడ్డున పడతామని ఆందోళన చెందారు. కానీ ఎట్టకేలకు ట్రంప్ ఉద్దీపన ప్యాకేజీపై సంతకం చేయడంతో నిరుద్యోగులు, పౌరులు ఊపిరి పీల్చుకున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/