ఢిల్లీలో నేటి నుండి మాల్స్, షాపులు, మెట్రో ఓపెన్

నిర్లక్ష్యంగా ఉండొద్దని హితవు

మాస్కులు ధరించి దూరం పాటించాలని సీఎం కేజ్రీవాల్​ సూచనలు

న్యూఢిల్లీ: ఢిల్లీలో నేటి నుండి మాల్స్, షాపులు, మెట్రో ఓపెన్ అయ్యాయి. ఢిల్లీ కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలోనే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లాక్ డౌన్ ను క్రమక్రమంగా ఎత్తేస్తున్నారు. అయితే, లాక్ డౌన్ సడలింపులు పెంచుతున్నామని నిర్లక్ష్యంగా ఉండొద్దంటూ ప్రజలకు కేజ్రీవాల్ సూచించారు. ఢిల్లీ ఆర్థిక వ్యవస్థ గాడిన పడేందుకు కృషి చేస్తూనే.. కొవిడ్ మహమ్మారిని కట్టడి చేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇవ్వాళ్టి నుంచి షాపులు, మాల్స్, మెట్రో వంటివి తెరుచుకుంటున్నందున కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచనలు చేశారు.

కరోనా నివారణకు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులు కడుక్కోవడం వంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో మరిచిపోవద్దని హితవు చెప్పారు. కాగా, వచ్చిపోయే వినియోగదారుల కోసం మాల్స్ రక్షణ చర్యలు చేపడుతున్నాయి. దాని కోసం ప్రత్యేకంగా రియల్ టైంలో ఎంత మంది వచ్చిపోతున్నారో లెక్కలు తీయాలని నిర్ణయించుకున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/