తవాంగ్‌లో ఘర్షణలు.. నేడు పార్లమెంట్ ఉభయసభల్లో రక్షణమంత్రి ప్రకటన

రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అత్యున్నత స్థాయి సమావేశం

defence-minister-rajnath-singh-will-make-a-statement-in-lok-sabha-at-12-pm-today-and-in-rajya-sabha-at-2-pm

న్యూఢిల్లీః భారత్‌, చైనా సరిహద్దులో అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో చోటుచేసుకున్న ఘర్షణలపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈరోజు పార్లమెంట్ ఉభయసభల్లో ప్రకటన చేయనున్నారు. లోక్‌సభలో మధ్యాహ్నం 12 గంటలకు, రాజ్యసభలో మధ్యాహ్నం 2 గంటలకు రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటనలు చేసే అవకాశం ఉన్నది.

మరోవైపు చైనా – భారత్ సైనికుల మధ్య అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో ఘర్షణ నేపథ్యంలో, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అత్యున్నత స్థాయి సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. రక్షణ దళాల చీఫ్ (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, ఇతర ముఖ్య అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ నెల 9న అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో తమాంగ్ వద్ద ఇరుదేశాల సైనికుల మధ్య దాడి జరిగింది. ఈ దాడిలో ఇరువైపుల సైనికులు గాయపడ్డారు. 

ఈ ఘటనపై ఈ రోజు మధ్యాహ్నం పార్లమెంటులో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటన చేయనున్నారు. దీనికంటే ముందు పరిస్థితిని క్షుణ్ణంగా తెలుసుకునేందుకు ఆయన సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై పార్లమెంటులో చర్చకు పలు పార్టీలు పట్టుబడుతుండడం గమనార్హం. దీనిపై లోక్ సభలో వివరణ కోరుతూ ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సైతం నోటీసు జారీచేశారు.

కాగా, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలోని తవాంగ్‌ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి ఈ నెల 9న భారత్‌-చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో పలువురు సైనికులకు గాయాలయ్యాయి. చైనా సైన్యం భారత భూభాగంలోకి చొచ్చుకురావడం ఘర్షణకు దారితీసింది. కాగా, ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ చేతగాని తనంవల్లే చైనా రెచ్చిపోతున్నదని విమర్శిస్తున్నాయి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/