సైబరాబాద్ పోలీసుల తాజా హెచ్చరిక

మీరు ప్రయాణించే డ్రైవర్ తాగినా మీకే శిక్ష

డ్రైవర్ తాగి ఉన్నాడని తెలిసీ ప్రయాణించడం నేరమన్న పోలీసులు

హైదరాబాద్ :  సాధారణంగా డ్రంకెన్ డ్రైవ్‌లో మద్యం తాగి వాహనం నడుపుతున్న వారిని పట్టుకుంటారు. అయితే, ఈ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని సైబరాబాద్ పోలీసులు నిర్ణయించారు. ఇకపై తాగి వాహనం నడిపే వారినే కాకుండా, ఆ వాహనంలో ప్రయాణిస్తున్న వారిపైనా కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని నిర్ణయించారు. మద్యం మత్తులో జరగుతున్న ప్రమాదాలకు అడ్డుకట్ట వేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ‘మీ డ్రైవర్, లేదంటే మీ స్నేహితుడు పరిమితికి మించి మద్యం తాగి కారు నడుపుతున్నాడా? పక్క సీట్లో మీరు కూడా ఉన్నారా? పోలీసుల తనిఖీల్లో పట్టుబడితే జైలుకు వెళ్లక తప్పదు’ అని ఆ పోస్టులో హెచ్చరించారు. డ్రైవర్ మద్యం తాగి వాహనం నడుపుతున్న విషయం తెలిసీ అందులో ప్రయాణించడం నేరమని పేర్కొన్నారు. ఎవరికైనా ఇవే నిబంధనలు వర్తిస్తాయని పోలీసులు స్పష్టం చేశారు. సో, ఇకపై మన డ్రైవర్ తాగినా మనం ఊచలు లెక్కించుకోవాల్సి వస్తుందన్న మాట. తస్మాత్ జాగ్రత్త!

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/