రెడ్ల సింహగర్జన లో నాపై దాడి చేయించింది రేవంత్ రెడ్డినే – మల్లారెడ్డి ఆరోపణ

రెడ్ల సింహగర్జన లో నాపై దాడి చేయించింది రేవంత్ రెడ్డినే అన్నారు మంత్రి మల్లారెడ్డి. ఘట్‌కేసర్‌ లో ఆదివారం రెడ్డి సింహగర్జన కార్యక్రమం జరుగగా… ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. ఆయన వచ్చినప్పుడు బాగానే ఉన్న వాతావరణం సభా వేదికపైకి ఎక్కి మాట్లాడుతుండగా..అక్కడికి వచ్చిన వారిలో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. పదే పదే టీఆరఎస్ ప్రభుత్వం గురించి , కేసీఆర్ పాలన గురించి మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతుండడం తో అక్కడున్న వారు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. మల్లారెడ్డి గో బ్యాగ్‌ అంటూ స్థానికులు నినాదాలు చేశారు. మల్లారెడ్డి కాన్వాయ్‌పై కుర్చీలు, బాటిళ్లు విసిరారు. కొందరు అయితే రాళ్లు, చెప్పులు సభా వేదిక వైపు విసిరే ప్రయత్నం చేశారు. దీంతో మల్లారెడ్డి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

తనపై దాడి వెనక తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి కుట్ర ఉందని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలను ప్రశ్నించినందుకే అనుచరుల ద్వారా దాడి చేయించారని పేర్కొన్నారు. అయినా తాను ఇలాంటి వాటికి భయపడే రకం కాదన్నారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మానిఫెస్టోలో టిఆర్ఎస్ హామీ ఇచ్చిందని, అయితే కరోనా కారణంగా కొంత ఆలస్యం అయిందని అన్నారు. ఇదే విషయాన్ని తాను చెబుతుండగా తనకు వ్యతిరేకంగా నినాదాలు చేసి దాడి చేశారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.