కాల్వలోకి కారు.. ఇద్దరి మృతి మరొకరు గల్లంతు

లోలాకుల మూల మలపు వద్ద అదుపు తప్పిన కారు

ఆత్రేయపురం: తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం లోలాకుల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శివరాత్రి వేడుకల్లో పాల్గొని తిరిగి కారులో ఇంటికి వెళ్తుండగా, అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు గల్లంతు కాగా వారిలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలంలోని గొల్లలకోడేరుకు చెందిన ముందిటి సరేశ్ వర్మ (36), చింతలపాటి శ్రీనివాస్‌రాజు (46), ఇందుకూరి వెంకట సత్యానారాయణరాజు, ముదునూరి వెంకటగణపతి రాజు, మున్నింటిసీతారామరాజు ఒకే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తుంటారు. నిన్న శివరాత్రి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని వసంతవాడలో బంధువుల ఇంటికి వచ్చారు. అందరూ కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ తెల్లవారుజామున తిరిగి కారులో తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో లోలాకుల మలపు వద్ద కారు అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ప్రమాదం నుంచి వెంకటగణపతిరాజు, సీతారామరాజు సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన ముగ్గురు గల్లంతు కాగా, వారిలో సురేశ్ వర్మ, శ్రీనివాస్‌రాజుల మృతి చెందారు. వారి మృతదేహాలను వెలికి తీశారు. గల్లంతైన వెంకట సత్యనారాయణ కోసం గాలిస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/