షిరిడీలో కొనసాగుతున్న బంద్
షిర్డి: సాయిబాబా జన్మస్థలంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో షిర్డి స్థానికులు ప్రకటించిన బంద్ ప్రశాంతంగా సాగుతుంది. షిర్డి సహా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. దుకాణాలు, పాఠశాలలు మూతపడ్డాయి. బంద్ కారణంగా షిర్డి వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. అయితే ఈ బంద్ ప్రభావం సాయిబాబా ఆలయం పడలేదు. యథావిధిగా భక్తులు సాయిబాబా దర్శనానికి తరలివస్తున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఏర్పాట్లు చేసింది. పర్బాని జిల్లా పత్రిలోని సాయి జన్మస్థానం అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ థాక్రే ప్రకటించడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. అయితే పత్రి సాయి జన్మస్థలం అని చెప్పేందుకు ఆధారాల్లేవని షిర్డి వాసులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో వివాదాన్ని పరిష్కరించేందుకు సంబంధీకులతో సిఎం ఉద్ధవ్ త్వరలోనే సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన కార్యాలయం ప్రకటించింది. మరోవైపు పత్రిలో కూడా ఆదివారం బంద్ పాటిస్తున్నట్లు పత్రి కృతి సమితి వెల్లడించింది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/