చెత్తబుట్టలో రూ.56 లక్షల విలువైన బంగారం..

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఇటీవల కాలంలో పెద్ద సంఖ్యలో బంగారం పట్టుబడుతోంది. ఇతర దేశాలనుండి పెద్ద ఎత్తున బంగారాన్ని తీసుకొచ్చి..ఇక్కడ అధికారులకు చిక్కుతున్నారు. అయితే అధికారుల నుండి తప్పించుకెందుకు చాల తెలివిగా బంగారాన్ని దాచిపెడుతున్నారు..కానీ అధికారుల మూడో కన్ను నుండి తప్పించుకోలేకపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి..ఎయిర్ పోర్ట్ సిబ్బంది తో కలిసి రూ. 56 లక్షల విలువైన బంగారాన్ని బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికాడు.

కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్‌ నుంచి బుధవారం రాత్రి ఓ ప్రయాణికుడు శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చాడు. తన వెంట రహస్యంగా రూ.56.63 లక్షల విలువైన 933 గ్రాముల బంగారం బిస్కెట్లను తీసుకొని ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. అయితే అతడు కస్టమ్స్‌ తనిఖీలకు రాకముందు అరైవల్‌లో ఉన్న మరుగుదొడ్డిలోకి వెళ్లాడు. అక్కడే ఉన్న ఓ చెత్త డబ్బాలో తాను తీసుకొచ్చిన బంగారాన్ని వేసి యథాతథంగా కస్టమ్స్‌ తనిఖీలకు వచ్చాడు. తనిఖీల్లో ఏమీ దొరక్కపోయినా.. అతడి తీరు అనుమానస్పదంగా కనిపించటంతో అధికారులు అతడిని విచారించారు.

దీంతో అసలు విషయం చెప్పేశాడు. తాను దుబాయ్ నుంచి బంగారాన్ని తీసుకొచ్చి చెత్తడబ్బాలో వేసినట్లు ఒప్పుకున్నాడు. దాన్ని ఎయిర్‌పోర్టు ఉద్యోగి బయటికి తీసుకెళ్లనున్నట్లు చెప్పడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే బంగారాన్ని తరలించేందుకు వెళ్లిన సదరు ఎయిర్‌పోర్టు ఉద్యోగిని కూడా అరెస్ట్‌ చేశారు.