రాష్ట్ర ప్రభుత్వాలు తప్పులు చేసి కేంద్రంపై విమర్శలు చేస్తున్నాయిః పురందేశ్వరి
ఏపీలో విధ్వంసకర పాలన కొనసాగుతోందని విమర్శ
అమరావతిః ఏపీకి ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అంశమని రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రత్యేక హోదా అవసరం లేదని ప్రత్యేక ప్యాకేజీ కావాలని చంద్రబాబు అడిగారని తెలిపారు. ఈ విషయాన్ని టిడిపి, కాంగ్రెస్, వైఎస్ఆర్సిపిలు గుర్తించాలని చెప్పారు. తప్పులన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు చేసి, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
2024 ఎన్నికల నగారా మోగించామని పురందేశ్వరి అన్నారు. బిజెపి అధికారంలోకి రాకముందు దేశంలో స్కామ్ లు మాత్రమే ఉండేవని… బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం కోసం స్కీమ్ లను తీసుకొచ్చిందని చెప్పారు. గత పదేళ్లుగా అవినీతి లేని పాలనను అందించామని తెలిపారు.
ఏపీలో విధ్వంసకర పాలన కొనసాగుతోందని విమర్శించారు. గుళ్లు, గుళ్లలోని విగ్రహాలను కూలగొడుతున్నారని మండిపడ్డారు. తలకాయ లేని మొండెంలా… రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని చేశారని అన్నారు. అమరావతిని ఏపీ రాజధానిగా భావించి నిధులు, రోడ్లు మంజూరు చేసిన ఘనత బిజెపికే దక్కుతుందని చెప్పారు. పోలవరంకు జాతీయ హోదాను కల్పించిన తర్వాత ప్రతి రూపాయిని కేంద్రమే ఖర్చు చేస్తోందని తెలిపారు.