ఢిల్లీలో కేసులు పెరుగుతున్నా పరిస్థితి అదుపులోనే ఉంది
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజుకు 3,000 చొప్పున పెరుగుతున్నాయి..
న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. ఈనేపథ్యంలో ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రివాల్ ఈ మధ్యాహ్నం ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ..ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నా పరిస్థితి అదుపులోనే ఉన్నదని కేజ్రివాల్ వెల్లడించారు. ఢిల్లీలో ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజుకు 3,000 చొప్పున పెరుగుతున్నదని చెప్పారు. అయితే, టెస్టుల సంఖ్యను కూడా గతం కంటే మూడు రెట్లు పెంచామని కేజ్రివాల్ తెలిపారు. ఢిల్లీలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులలో 45,000 మంది వైరస్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారని, 2,400 మంది కరోనా బాధితులు మృతిచెందారని కేజ్రివాల్ వెల్లడించారు. మరో 26,000 యాక్టివ్ కేసులు ఉన్నాయని, అందులో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న 6,000 మంది ఆస్పత్రుల్లో, తీవ్రత తక్కువగా ఉన్నవారు వారి ఇండ్లలో ఉండి కరోనా చికిత్స పొందుతున్నారని తెలిపారు. రోజూ మూడు వేల కేసులు నమోదవుతున్నా అందరూ ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేనందున గత వారం రోజుల వ్యవధిలో 6,000 పడకలు మాత్రమే నిండాయని చెప్పారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/